తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో త.శె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన కోర్టు రూమ్ డ్రామా ‘జై భీమ్’. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే విమర్శకుల ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో వచ్చిన ఓ చెంపదెబ్బ సీన్ ప్రస్తుతం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే.. హిందీ మాట్లాడుతున్న ఓ వ్యక్తిని పోలీస్ పాత్రధారి అయిన ప్రకాష్రాజ్ చెంపదెబ్బ కొడతాడు. దాంతో ప్రకాష్ రాజ్ పాత్ర ఈ విధంగా చేయడం ‘హిందీ భాషని అవమానించడమే’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ఈ విమర్శలు పై స్పందిస్తూ.. ‘జై భీమ్ సినిమాలో అణగారిన వర్గాల వారి బాధలను చూపించడం జరిగింది.
అయితే, కొంతమంది మాత్రం అసలు విషయాన్ని వదిలేసి.. చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నేను నటించాననే కారణంతోనే అనవసరంగా ఈ సినిమాను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి వివాదాలపై స్పందించడం అర్థం లేదు’ అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.