టీవీ9 నెట్వర్క్ యాజమాన్యం, వాటాల మార్పులపై ఇటీవల జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, మై హోమ్ గ్రూప్ చైర్మన్ శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు సంస్థ నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. అలందా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య నిర్మాణంలో గానీ, వాటాల విషయంలో గానీ ఎలాంటి మార్పులు జరగలేదని మేనేజ్మెంట్ వెల్లడించింది.
టీవీ9 ఎప్పుడూ స్వతంత్ర, వృత్తిపరమైన విలువలతో నడిచే సంస్థ అని, రాజకీయ లేదా వ్యాపార ఒత్తిళ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న వాదనలు సరైనవి కావని సంస్థ పేర్కొంది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారమవుతున్న నిరాధారమైన కథనాలను నమ్మవద్దని ప్రజలకు, ప్రకటనకర్తలకు విజ్ఞప్తి చేసింది. కేవలం సంస్థ జారీ చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.



