ప్రజా తీర్పును అవమానించకండి.. విజయ్‌కి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందే – కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

ప్రజా తీర్పును అవమానించకండి.. విజయ్‌కి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందే – కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

Published on May 7, 2026 1:12 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కీలక సమయంలో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ను వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కమల్ స్పష్టం చేశారు. విజయ్‌కి ఆ అవకాశం ఇవ్వకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన 233 మంది ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎదురుచూడటం రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రకటించడాన్ని కమల్ స్వాగతించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ పరిణతిని చూపిస్తోందని కొనియాడారు. ఇదే సమయంలో పరోక్షంగా గవర్నర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, ఇది తాను చేస్తున్న డిమాండ్ కాదని.. కేవలం వారి రాజ్యాంగబద్ధమైన విధిని మాత్రమే గుర్తుచేస్తున్నానని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తలెత్తే న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ పాత్ర గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ ప్రఖ్యాత ‘ఎస్.ఆర్. బొమ్మై’ కేసును తెరపైకి తెచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేనప్పుడు, బలపరీక్ష అనేది రాజ్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలో మాత్రమే జరగాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక పార్టీ నాయకుడిగా కాకుండా, రాజ్యాంగంపై అవగాహన ఉన్న భారతీయ పౌరుడి విధానపరమైన గొంతుకగా తాను ఈ విషయాలు మాట్లాడుతున్నానని కమల్ స్పష్టం చేశారు. దీనితో కమల్ నుంచి ఈ షాకింగ్ రెస్పాన్స్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు