తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ప్రస్తుతం కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా `మన్మథుడు 2`ను తన రెండో చిత్రంగా తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే రాహుల్ తన తదుపరి మూడో సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక రాహుల్ `మన్మథుడు 2’లో నాగార్జునను కొత్తగా చూపించబోతున్నాడని.. ఖచ్చితంగా తను తీసిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని.. అన్నిటికిమించి ఈ చిత్రాన్ని రాహుల్ అందమైన కుటుంబ భావోద్వేగాల చిత్రంగా తీర్చి దిద్దాడని చిత్రబృందం చెబుతుంది. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం.