వెర్సటైల్ యాక్టర్ ఆది సాయికుమార్ హీరోగా, యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ థ్రిల్లర్ ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ అర్చన ఐయ్యర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. తాను చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగమ్మాయినేనని, ఈ సినిమా ప్రీమియర్లకు వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
సినిమాలో తాను పోషించిన ‘దేవి’ పాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని అర్చన పేర్కొన్నారు. కెరీర్ ఆరంభంలోనే కేవలం పాటలకు పరిమితం కాకుండా, నటనకు ఆస్కారమున్న ఇలాంటి బలమైన పాత్ర దొరకడం తన అదృష్టమని ఆమె చెప్పారు. దర్శకుడు చెప్పిన స్క్రీన్ ప్లే నచ్చడంతో కథ పూర్తిగా వినకముందే సినిమాకు ఓకే చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఇక హీరో ఆది చాలా డౌన్ టు ఎర్త్ అని, ఆయన సహకారం వల్లే తాను బాగా నటించగలిగానని తెలిపారు.
నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్గా నిర్మించారని అర్చన కొనియాడారు. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ‘శంబాల’ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని, విజువల్స్ మరియు సౌండ్ పరంగా ఈ చిత్రం గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ భారీ ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్లు అర్చన వెల్లడించారు.


