ముఖ్య అంశాలు
- కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భారత్ భాగ్య విధాత’ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరుస్తోంది.
- ఆదివారం రాబట్టిన కలెక్షన్లతో పోలిస్తే, మొదటి సోమవారం వసూళ్లు ఏకంగా 64 శాతం పడిపోయాయి.
- రిలీజైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా కేవలం రూ. 4.9 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయి స్పందన రావడం లేదు. వీకెండ్లో కలెక్షన్స్ కాస్త పర్వాలేదనిపించినా.. ఫస్ట్ మండే టెస్ట్లో మాత్రం ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది.
సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నాలుగో రోజు ఈ చిత్రం కేవలం 65 లక్షల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది. ఆదివారం నాడు ఈ మూవీ 1.8 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆ నంబర్తో పోల్చి చూస్తే ఇది దాదాపు 64 శాతం డ్రాప్ అని చెప్పాలి. మొత్తంగా మొదటి నాలుగు రోజులు పూర్తయ్యే సరికి ఇండియా వ్యాప్తంగా ‘భారత్ భాగ్య విధాత’ కేవలం రూ. 4.9 కోట్ల నెట్ (రూ. 5.86 కోట్ల గ్రాస్) వసూళ్లు మాత్రమే సాధించింది. కంగనా గత చిత్రం ‘ఎమర్జెన్సీ’ తొలి నాలుగు రోజుల్లోనే 11 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. ఆ మూవీతో పోలిస్తే తాజా వసూళ్లు చాలా తక్కువ.
మనోజ్ తపాడియా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో 2008 ముంబై దాడుల సమయంలో కామా ఆసుపత్రిలో జరిగిన భయానక వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు అంజలి కుల్తే ధైర్యసాహసాలను ఇందులో ప్రధానంగా హైలైట్ చేశారు. కంటెంట్ పరంగా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా.. థియేటర్లకు జనాన్ని రప్పించడంలో మాత్రం మూవీ యూనిట్ సక్సెస్ కాలేకపోయింది. ఇదే సమయంలో రిలీజైన ఇంతియాజ్ అలీ ‘మైన్ వాపస్ ఆవుంగా’, విక్రమ్ భట్ ‘హాంటెడ్ 3డీ’ సినిమాల కలెక్షన్స్ స్టడీగా ఉండటంతో.. కంగనా మూవీకి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురవుతోంది.
సోమవారం కలెక్షన్స్ ఇంతలా పడిపోవడంతో ఈ సినిమా ముందు ముందు కోలుకోవడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే వీక్ డేస్లో అద్భుతాలు జరిగితే తప్ప, బాక్సాఫీస్ రేసులో ఈ సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.


