ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ, జోనర్ గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా అల్లు అర్జున్ తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకోనుండగా, 2027 ప్రారంభం నుండి ఆయన తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.
ఇక దర్శకుడు అట్లీ ఈ చిత్రం కోసం భారీ ఎత్తున పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులను ప్లాన్ చేశాడు. టాప్ హాలీవుడ్ స్టూడియోస్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను చూసుకుంటుండటంతో, అవుట్పుట్ పక్కాగా రావడానికి అట్లీకి చాలా సమయం అవసరమవుతుంది. అందువల్ల, ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారట.
ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్స్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే షూటింగ్ మొత్తం ముగిసేవరకు చిత్రబృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించేలా లేదు. కాగా, ఈ సినిమాలో దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.


