సీనియర్ నటులు రాళ్ళపల్లి మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో ముంచి వేసింది. దశాబ్దాలుగా తన విలక్షణ నటన, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో తెలుగు సినిమాపై తనదంటూ ముద్రవేశారు రాళ్ళపల్లి. కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాలలో నటించారు. ఆయన మృతికి తెలుగు పరిశ్రమ కు చెందిన ప్రముఖులతో పాటు…,రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి రాళ్ళపల్లి తో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘చెన్నైలోని వాణి మహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ‘మా’ ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను’ అని చిరంజీవి తెలిపారు.
సీనియర్ సినీ నటుడు రాళ్లపల్లి మృతిపట్ల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుద చేశారు. తనదైన శైలిలో సునిశితహాస్యతో రాళ్లపల్లి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. నాటక,చలన చిత్ర రంగంలో ఆయనది ఓ ప్రత్యేకశైలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.