తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్ఓగా, జర్నలిస్ట్గా అందరికీ సుపరిచితుడైన ఏలూరు శ్రీను ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘డ్యూ డేట్’ (Due Date). వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఆనంద్.కె దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్లు, సక్సెస్ఫుల్ నిర్మాతలు విచ్చేసి చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. హీరో లోమేష్ పూడిపెద్ది, హీరోయిన్ జయశ్రీతో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ నిచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కెమెరాను సక్సెస్ఫుల్ నిర్మాత బన్నీ వాస్ స్విచ్చాన్ చేశారు. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్కు స్క్రిప్ట్ను అందజేశారు.
బర్నింగ్ ఇష్యూతో ఆకట్టుకునే కథనం
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ ఇష్యూ ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు మేకర్స్ తెలిపారు. కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. టైటిల్ దగ్గర నుంచి సినిమాలో ఉండే ప్రతి అంశం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని, కథ, కథనాలు అందరినీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు విజయ్ కనకమేడల, వి.ఐ. ఆనంద్లతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొని సందడి చేశారు. లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, చందు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చెంచు జింక సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


