తిరుమల: నవంబర్: 16
లింగార్చనలు, మహాలింగార్చనలు , సహస్ర లింగార్చనలు , రుద్రాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, పార్థివ లింగార్చనలతో దేశవ్యాప్తంగా లక్షలకొలది శైవక్షేత్రాలు ఒకవైపు శివోహంతో పరవశిస్తుంటే … మరోవైపు తిరుమల మహాక్షేత్రంకు దిగువన వున్న కపిలతీర్థ మహా శైవ క్షేత్రంలో ప్రముఖ నిర్మాత , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించి సంకలనం చేసిన నూట పన్నెండు పేజీల శివ సౌందర్య పవిత్ర గ్రంధం ‘ శివస్సివం’ గత మూడు రోజులుగా వేలకొలది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలకు విచ్చేసే తెలుగు భక్తుల కోసం ప్రముఖ నిర్మాత ‘ దిల్ రాజు ‘ ఈ కార్తీకమాసంలో సమయస్ఫూర్తితో ప్రచురించిన ఈ శివభక్తిరస గ్రంధం ముద్రణలోనూ, ప్రత్యేకతలోనూ ఒక విశిష్టత సంతరించుకోవడం గమనార్హం.
మరొక ముఖ్యాంశమేమిటంటే తిరుమల తిరుమల మహాక్షేత్ర ప్రధానార్చకులు డాక్టర్ ఏ.. వేణుగోపాలాచార్యులు ఈ ‘ శివస్సివం’ గ్రంధాన్ని ఆవిష్కరించి , అక్కడి పండిత వర్గాలకు, అర్చక ప్రముఖులకు అందించడం హర్షణీయం..
తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు, ప్రస్తుత ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు లగాయతు ఇప్పటి ప్రధాన అర్చకులకు, అర్చక వేదపండిత బృందాలకు , అధికార వర్గాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పట్ల, ఆయన అద్భుత గ్రంధాలపట్ల, నిస్వార్ధ సేవ పట్ల ఎంతో వాత్సల్యం , అభిమానం ఉన్నాయనేది గత దశాబ్దంగా లక్షలమందికి తెలుసున్న అంశమే. తిరుమల వేదపాఠశాల, తిరుమల వేద విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయంలో పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కి అభిమానులు కోకొల్లలు.
ఇక పోతే వేంకటేశ్వర స్వామి పరమ భక్తులు దిల్ రాజు. ప్రతీ సంవత్సరం ఎదో ఒక బుక్ దిల్ రాజు ప్రచురించి వేంకటాచల క్షేత్రం పండిత వర్గాలకి, భక్తులకు పంపుతూనే వుంటారు. వాటికి వున్న ఆదరణ అనూహ్యం. ఈ సంవత్సరం తిరుమల శ్రీవారి క్షేత్రపాలకుడైన కపిలతీర్ధ శివుడికి దిల్ రాజు అనుచరులు పంచిన గ్రంధాలు చాలా చాలా ఆనందింపచేశాయి.
ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ధ్వని వున్నట్లుగా ఈ మహనీయ గ్రంధాన్ని తీర్చి దిద్దిన పురాణపండ శ్రీనివాస్ రచనా సౌందర్యం ధన్యమనే చెప్పక తప్పదు. మృత్యుముఖంలో ముడుచుకున్న వారిని సైతం బయటకు తీసుకు రాగల మహామృత్యుంజయ మంత్రం శక్తులతో ఈ గ్రంధాన్ని నిర్మించారు. మానవ జన్మ ఎత్తినందుకు దిల్ రాజు సమర్పించిన ఈ శివమంత్ర తేజస్సు అఖండం. అద్భుతం.
కపిల తీర్ధ మహా శైవ క్షేత్రంలో కార్తీక మాసం ఆరంభంలో జ్వాలాతోరణం వెలింగించిన పవిత్ర సందర్భంలో హైదరాబాద్ కి చెందిన వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతులు శివాజ్ఞగా సమర్పించిన వేలాది ‘ హరోంహర ‘ దివ్యగ్రంధాలు సృష్టించిన పవిత్ర సంచలనం అంతా, ఇంతా కాదు. రెండవ కార్తీక సోమవారం నగరి ఎమ్మెల్యే రోజా నగరి శివాలయాలలోనూ, పుత్తూరు శివాలయాలలోనూ తానే స్వయంగా ” శంకర శంకర” గ్రంధాన్ని ఆవిష్కరించి పంచడం అక్కడి వేలాది భక్త జనుల్ని ఆకట్టుకుంది. ఈ గ్రంధాలకు కూడా పురాణపండ శ్రీనివాస్ రచనా సంకనాకర్తకావడం శివాజ్ఞగానే కనిపిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా పురాణపండ శ్రీనివాస్ వండర్ఫుల్ బుక్స్ ‘ నేనున్నాను’, శరణు శరణు, అమ్మణ్ణి, మహామంత్రస్య, అమృతధార, శ్రీపూర్ణిమ, అమృతమస్తు వంటి ఎన్నో గ్రంధాలు వెంకటాచలక్షేత్రం ఒడిలోకి చేరి ఎంతోమందిని పరవశింపచేసాయనడం సత్యం. సత్యం సత్యం.
ఇలాంటి నిస్వార్ధమైన అద్భుత రచనల పురాణపండ శ్రీనివాసలాంటి వ్యక్తిని, నిరంతరం కష్టపడే ఈ శ్రమైక జీవన సౌందర్య ప్రచురణల శక్తిని , ఎక్కడో గానీ మనం చూడలేం. ఆ మనిషి చేసే కృషి అలాంటిది. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాస్ జీ.