ఇంటర్వ్యూ: డైరక్టర్ హాసిత్ గోలి – శ్రీ విష్ణు గారి టైమింగ్ అంటే చాలా ఇష్టం

ఇంటర్వ్యూ: డైరక్టర్ హాసిత్ గోలి – శ్రీ విష్ణు గారి టైమింగ్ అంటే చాలా ఇష్టం

Published on Aug 17, 2021 7:24 PM IST

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాజ రాజ చోర‌. ఈ చిత్రం లో మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హిసిత్‌ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌ మరియు అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆగ‌స్ట్ 19న సినిమా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌సిత్ గోలి ఇంట‌ర్వ్యూ విశేషాలు.

హసిత్ గోలి నాన్న‌ గోలి హ‌నుమ‌త్ శాస్త్రి, హౌసింగ్ కార్పొరేట్‌ లో ఆయ‌న సివిల్ ఇంజ‌నీర్‌, ఆయ‌న‌కు సాహిత్యం అంటే చాలా ఇష్టమని, ఇప్ప‌టికీ ఆయ‌న ఓ బ్లాగ్ మెయిన్‌టెయిన్ చేస్తూ అందులో ప‌ద్యాలు, సాహిత్యంకు సంబంధించిన విషయాల‌ను పోస్ట్ చేస్తుంటారని అన్నారు. ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ తనకు రాలేదు అని, కానీ సాహిత్యంపై అభిరుచి అయితే పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

చిన్న‌ప్ప‌ట్నుంచి సినిమాలంటే ఇష్టమని తెలిపిన హసిత్, తను, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ చిన్న‌ప్ప‌ట్నుంచి స్నేహితులమని అన్నారు. ఇద్ద‌రూ క‌లిసే సినిమాలు చూసేవాళ్లని, తను, వివేక్ క‌లిసి షార్ట్ ఫిలింస్ చేసినట్లు తెలిపారు. ఇద్ద‌రూ ఐడియాస్ పంచుకుంటూ వ‌ర్క్ చేసేవాళ్లని అన్నారు.

తాము చేసిన షార్ట్ ఫిలింస్‌కు మంచి అప్రిషియేష‌న్స్ రావ‌డంతో ముందు వివేక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అని, అదే స‌మ‌యంలో తను జాబ్ చేస్తుండేవాడినని అన్నారు. వివేక్ కి రాజ్ కందుకూరి గారి బ్యాన‌ర్‌లో మెంట‌ల్ మ‌దిలో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చిందని, చేసే ప్ర‌య‌త్నమేదో ఇప్పుడే చేయాలనిపించి తను కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు.

మంచి జాబ్ వ‌దిలేసి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టే స‌మ‌యంలో ఇంట్లో వాళ్లు కంగారు ప‌డ్డారు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అమ్మ బాగా కంగారు ప‌డిందని, అయితే నాన్న‌గారు బాగా స‌పోర్ట్ చేశారని తెలిపారు. మెంట‌ల్ మ‌దిలో సినిమా చూసిన త‌ర్వాత వీళ్లేదో ఆక‌ర్ష‌ణ‌కు లోనై వెళ్ల‌లేదు అని, ఏదో క్లారిటీతోనే వెళ్లారు అని ఇంట్లో వాళ్ల‌కి అనిపించింది అని అన్నారు. శ్రీ విష్ణు గారు ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నార‌నే దానిపై, తాము ఆలోచిస్తున్న క‌థ‌ల‌పై క్లారిటీ ఉండ‌టంతో తమకు ఒక ఊతం దొరికింద‌ని ధైర్యం ఉండింది అని అన్నారు.

మెంట‌ల్ మ‌దిలో త‌ర్వాత తను ఓ క‌థ‌ను శ్రీ విష్ణుగారికి చెప్పినట్లు తెలిపారు. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చిందని, అయితే ఓ క‌థ‌ను రాయ‌డం కంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయ‌డానికి అనుభ‌వం అవ‌స‌రం అనిపించిందని అన్నారు. అందుక‌ని తనే కాస్త ఆగినట్లు చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో బ్రోచెవారెవ‌రురా సినిమా స్టార్ట్ అయ్యిందని, ఆ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసినట్లు తెలిపారు. అంతా ఓకే అనుకుని అంత‌కు ముందు శ్రీ విష్ణుకి చెప్పిన క‌థ‌తో సినిమా చేద్దామ‌ని అనుకున్నామని అన్నారు. అయితే, ఇంకా బెట‌ర్ లైన్ ఐడియాలోకి రావ‌డంతో ఈ సినిమాను స్టార్ట్ చేశామని అన్నారు.

పాజిటివ్ క్యారెక్ట‌ర్ కంటే గ్రేషేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో కాస్త డ్రామా ఎక్కువ‌గా ఉంటుంద‌నేది తన అభిప్రాయం అని అన్నారు. దాన్ని హిలేరియ‌స్ జోన‌ర్ చూపించాల‌ని అనుకున్నా, బేసిగ్గా, శ్రీవిష్ణుగారి కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. దాన్ని పూర్తి స్థాయిలో ఎవ‌రూ చూపించ‌లేదని, ఈ సినిమాలో దాన్ని చూపించ‌బోతున్నామ‌ని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఓ దొంగ ఎందుకు దొంగ‌త‌నాలు చేస్తున్నాడు అనే కోణాన్ని కామెడీ కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేసినట్లు చెప్పుకొచ్చారు.

కామెడీ డ్రామా జోనర్ మూవీ ఇది, కథ లేకపోతే కామెడీతో సినిమారన్ అవుతుందని అనుకోను, డైరెక్టర్‌గా డ్రామాను ఇష్ట‌ప‌డ‌తా అని అన్నారు.

సినిమాలో కామెడీని జ‌న‌రేట్ చేసే విష‌యాల్లో కిరీటం కూడా ఓ రోల్‌ను ప్లే చేస్తుంది, అదేంటో సినిమా చూడాల్సిందే అని చెప్పుకొచ్చారు. సినిమాలో ప్ర‌తి పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది, ముఖ్యంగా శ్రీవిష్ణు పాత్ర, గంగ‌వ్వ పాత్ర అంద‌రికీ న‌చ్చుతుంది, ఈ సినిమాలో శ్రీవిష్ణు కొంటె దొంగ‌ అని అన్నారు.

ముందు ఎం.ఎల్‌.కుమార్ చౌద‌రిగారు, కీర్తిగారికి క‌థ చెప్పాం, న‌చ్చింది, త‌ర్వాత విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్‌గారు కూడా యాడ్ అయ్యారు అని గుర్తు చేసుకున్నారు.

అయితే కోవిడ్ ఫ‌స్ట్ వేవ్‌, లాక్‌డౌన్ స‌మ‌యానికి సినిమా పూర్తి కాలేదు అని, త‌ర్వాత సెకండ్ వేవ్ వ‌చ్చే స‌మ‌యానికి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌కు చేరుకున్నామని అన్నారు. అప్పుడు ఓటీటీ అవ‌కాశాలు వ‌చ్చాయి, అయితే నిర్మాత‌లు సినిమాను ఓటీటీలో కాకుండా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత, మ‌రో స్క్రిప్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నట్లు తెలిపారు. దాన్ని ముందు పూర్తి చేస్తానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు