కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తదుపరి చిత్రం ‘కరుప్పు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్, 2026 ఏప్రిల్ 10న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య కెరీర్లో 45వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, సూర్య తన మైలురాయి చిత్రం ‘సూర్య 50’ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్తో జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామాజిక అంశాలు, అణచివేత వంటి గంభీరమైన కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే మారి సెల్వరాజ్, ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత థాను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సూర్య తన 46వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అటు మారి సెల్వరాజ్ కూడా ధనుష్, కార్తీ వంటి స్టార్ హీరోల ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే 50వ చిత్రం మరిన్ని విశేషాలతో సెట్స్ పైకి వెళ్లనుంది.


