సూపర్ స్టార్ రజనీకాంత్ తన 168వ సినిమాను శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన యంగ్ హీరోయిన్ కాకుండా వయసులో పెద్దగా కనబడే నటి అయితే బాగుంటుందని ఖుష్బూను తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
రజనీ గత చిత్రాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఆ తరహాలోనే కొత్త చిత్రంలో ఖుష్బూతో జోడీ కట్టనున్నారట. ఈ వార్త విన్న ఫ్యాన్స్ సైతం కొంచెం సప్రైజ్ ఫీలైనా వారిద్దరి పెయిర్ బాగుంటుందని అంటున్నారు. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాలు చేశారు.
రజనీ మొదటిసారి శివతో చేస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇకపోతే మురుగదాస్ డైరెక్షన్లో రజనీ చేసిన ‘దర్బార్’ చిత్రం జనవరి 9న విడుదలకానుంది.


