‘అఖిల్’.. గత కొద్దిరోజులుగా తెలుగు సినిమాలో మారుమోగిపోతోన్న పేరు. అక్కినేని నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆ వంశంలో మూడో తరం నుంచి అక్కినేని అఖిల్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అన్న పేరుతోనే అఖిల్ మొదటి సినిమా రూపొందడంతో ఈ పేరు అంతటా క్రేజీగా మారింది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్లో భారీ ఎత్తున జరిగింది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్మాత నితిన్ ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషంగా కనిపించింది.
ఆడియో ఆవిష్కరణ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, అఖిల్ను పొగడ్తలతో ముంచెత్తారు. “మనం సినిమాలో అఖిల్ స్క్రీన్పై కనిపించిన ఒక నిమిషం స్క్రీనంతా వెలిగిపోయింది. నాగార్జున గారికి ఇదే విషయం చెప్పినపుడు, ఆయన ఒక్క నిమిషం అలా కనబడి అఖిల్ సినిమా క్రెడిట్ మొత్తం కొట్టేశాడని అన్నారు. అది నిజం. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ టెర్రిఫిక్గా ఉంది. ట్రైలర్లో అది స్పష్టమవుతోంది. అఖిల్ తెలుగు సినిమాకు మరో పెద్ద హీరో” అంటూ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మహేష్ తెలిపారు. అక్టోబర్ ౨౨న దసరా కానుకగా అఖిల్ సినిమా విడుదల కానుంది.


