
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా నిన్నటితో వంద రోజులు కూడా పూర్తి చేసుకొని మహేష్ కెరీర్లో ఓ స్పెషల్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మహేష్ సైకిల్ వాడడం సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఆసక్తికరంగా కనిపించింది.
ఈ నేపథ్యంలో మహేష్ వాడిన సైకిల్ను శ్రీమంతుడు ఫ్యాన్స్కు అందించాలని టీం, ఓ ప్రత్యేక కాంటెస్ట్ను ఏర్పాటు చేసింది. ఇక ఎంతోమంది ఈ కాంటెస్ట్లో పాల్గొనగా, ఈ ఉదయం మహేష్, శ్రీమంతుడు సైకిల్ కాంటెస్ట్ విజేతను స్వయంగా ప్రకటించారు. శ్రీమంతుడు సైకిల్ కాంటెస్ట్లో కరీంనగర్ జిల్లాకు చెందిన జి. నాగేందర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఇక ఈ విజేతకు మహేష్ స్వయంగా సైకిల్ను అందజేయనున్నారు. నేడు జరిగిన ఈ కాంటెస్ట్ విన్నర్ ఎంపిక కార్యక్రమంలో మహేష్తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు.

