ఇండియన్ సినీ పరిశ్రమలో లేడీ దర్శకులు, రచయితల సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ అభిప్రాయపడింది. ప్రముఖ ‘వెరైటీ ఇండియా’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమలో మహిళా మేకర్స్ తక్కువగా ఉండటం వల్లే ప్రధాన స్రవంతి సినిమాల్లో స్త్రీ పాత్రలు పరిమితంగా, ఒకే రకంగా ఉంటున్నాయని అన్నారు. “మనకు ‘ఫీమేల్ గేజ్’ నుండి వచ్చే కథలు చాలా అవసరం. ఎక్కువ మంది మహిళా దర్శకులు వచ్చినప్పుడు, వారు ఖచ్చితంగా వైవిధ్యమైన, ఆసక్తికరమైన యాక్షన్ పాత్రలను రాస్తారు. అప్పుడే మనకు భారతీయ వెర్షన్ ‘కిల్ బిల్’ లాంటి పవర్ ఫుల్ సినిమాలు వస్తాయి” అని మాళవిక ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో అమీర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని మాళవిక ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ సినిమాలో మహిళా పాత్రలను చూపించిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేవలం గ్లామరస్ (“ఫ్లవర్ పాట్”) పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన పాత్రలను ఎంచుకోవాలని భావిస్తున్నట్లు ‘ది రాజా సాబ్’ నటి స్పష్టం చేశారు.


