‘పుత్తడి బొమ్మ’ అనే సీరియల్ తో తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ రైటర్ గా ఎదిగారు బుర్రా సాయిమాధవ్. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ సినిమాలు రాస్తున్న రచయిత, ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న రచయిత కూడ ఈయనే. ‘మహానటి’కి అద్భుతమైన మాటలు అందించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన ఈయన ‘సైరా, ఎన్టీఆర్, గజదొంగ టైగర్ నాగేశ్వరరావు’ ఇలా పలు బయోపిక్ లకు ఆయనే మాటలు అందిస్తున్నారు.
కాగా బుర్రా సాయిమాధవ్ రచన చేస్తూనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించబోతున్నారు. నిర్మాతగా మారి త్వరలో వెబ్ సిరీస్లను రూపొందించటానికి ‘సినిమా టాకీస్`’అనే బ్యానర్ ను కూడా స్థాపించారు. ఆ బ్యానర్ పై ఆయన వరుసగా వెబ్ సిరీస్లును నిర్మించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొదటిగా నిర్మించే వెబ్ సిరీస్ కు పూర్తి స్క్రిప్టు కూడా రెడీ అయిందని తెలుస్తోంది. సాయిమాధవే స్వయంగా ఈ స్క్రిప్ట్ ను రాశారు.