శ్రీకాళహస్తీశ్వరునికి పురాణపండ ‘ శివోహమ్’ ను సమర్పించిన ఎమ్మెల్యే రోజా

శ్రీకాళహస్తీశ్వరునికి పురాణపండ ‘ శివోహమ్’ ను సమర్పించిన ఎమ్మెల్యే రోజా

Published on Feb 24, 2020 6:00 AM IST

పంచ మహాపాతకాల్ని భస్మం చేసి, పరమపుణ్యాలను ప్రసాదించే రుద్ర నమక చమక శక్తుల రహస్య విశేషాలతో పాటు సుమారు నలభై మూడు అపురూప శివ కవచ, స్తోత్ర, వ్యాఖ్యాన వైభవాలతో కూడిన ప్రముఖ రచయిత ‘ శివోహమ్ ‘ గ్రంధాన్ని మహాశివరాత్రి లింగోద్భవకాలంలో తమకు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో నగరి ఎమ్మెల్యే శ్రీమతి ఆర్ .కె .రోజా బహూకరించడాన్ని శ్రీకాళహస్తి పండిత అధికార బృందాలు ప్రశంసిస్తున్నాయి . మహా శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో మహారుద్రాభిషేకం నిర్వహించి, వేలకొలది అధికార , అనధికార , భక్తబృందాలతో కలిసి తాను కూడా రధోత్సవంలో పాల్గొని మహారధాన్నిలాగి పరవశించి పోయారు రోజా .

శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనాసొగసుల వ్యాఖ్యాన వైఖరీదక్షతలతో శ్రీమతి రోజా గతంలో ప్రచురించిన ‘ శ్రీపూర్ణిమ ‘ అఖండ గ్రంధానికి తిరుమల ప్రధాన అర్చక బృందంతోపాటు , మఠాధిపతులు , పీఠాధిపతుల అనుగ్రహం దక్కడాన్ని మరువకముందే అద్భుత మంత్రపేటిక గా ‘ శివోహమ్’ విశేష గ్రంధాన్ని రోజా వెలువరించడాన్ని పార్టీ వర్గాలు, పండిత వర్గాలు అభినందిస్తున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధానంలో ఈ దివ్య మంగళ గ్రంధాన్ని తానే ఆవిష్కరించి , భక్త బృదాలకు అందజేయడం పురాకృత జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు శ్రీమతి రోజా వినయంగా చెప్పారు .

ఈ సందర్భంగా తొలిప్రతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి శ్రీమతి రోజా అందజేశారు. శివరాత్రి శుభవేళని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ శివోహమ్ గ్రంధాలను అర్చక, వేదపండిత, భక్త బృందాలకు ఉచితంగా వితరణ చెయ్యడం గమనార్హం రాజకీయాలలోనే కాకుండా , భక్తి కార్యక్రమాల్లో కూడా ఇంత శ్రద్ధగా శ్రీమతి రోజా పాల్గొనడం తమకు ఆనందంతో పాటు , ఆశ్చర్యాన్ని కలుగచేస్తోందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి అభినందించారు . ఇదే సమయంలో శివోహమ్ గ్రంధాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ,విశాఖపట్నం, నగరి, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాలలో సైతం పవిత్రంగా వేలకొలది భక్తులకు చేరి రోజా, పురాణపండ శ్రేనివాస్ అసాధారణ కృషిని విజ్ఞులు ప్రశంసించడం విశేషమే మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు