సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కనబడుటలేదు. బాలరాజు ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆగస్ట్ 13న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరియు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిగ్ టిక్కెట్టును ఆవిష్కరించారు.
ఈ సంధర్భంగా పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కనపడుట లేదు అనే టైటిల్ నన్నెంతగానో ఇన్స్పైర్ చేసింది అని అన్నారు.
సుక్రాంత్ మాట్లాడుతూ, డైరెక్టర్ బాలరాజుగారితో ఐదేళ్ల నుంచి జర్నీ చేస్తున్నట్లు తెలిపారు. దాని కారణంగానే ఈరోజు స్టేజ్పై నిలబడి ఉన్నానని, పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో అండగా నిలబడిన మా మ్యూజిక్ డైరెక్టర్ మధు పొన్నాస్ గారు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ను అందించారని తెలిపారు. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందని, కంటెంట్ బావుంటే సినిమాను ఎలా ఆదరిస్తారో మాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. ఆగస్ట్ 13 వ తేదీన మీ ముందుకు రాబోతున్నాం, కచ్చితంగా సినిమాను పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నామని అన్నారు. అందరికీ థాంక్స్ అని అన్నారు.
హీరోయిన్ వైశాలి మాట్లాడుతూ, సినిమాలో నటించడం అనేది తన డ్రీమ్ అని అన్నారు. చాలా ఎమోషనల్ గా, నెర్వస్ గా ఉందని, మాటలు రావటం లేదని, ఆగస్ట్ 13న థియేటర్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నామని అన్నారు. మా కనబడుటలేదు యూనిట్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నామని అన్నారు.
డైరెక్టర్ బాలరాజు ఎం మాట్లాడుతూ, నాకు సినిమాలంటే పిచ్చి ఏర్పడటానికి కారణం రామ్గోపాల్ వర్మగారు అని అన్నారు. ఆయన సినిమాలు చూసి సినిమా అంటే ఇష్టం ఏర్పడిందాని, ఇంటర్నేషనల్ మేకింగ్ను, సౌండింగ్ను మన సినిమాలకు పరిచయం చేసిన తొలి దర్శకుడాయన అంటూ ప్రశంశల వర్షం కురిపించారు. అలాగే మన సినిమాలను ఇంటర్నేషనల్ స్థాయికి కథల రూపంలో పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ గారే అని అన్నారు. సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తేనే సక్సెస్ ఏమో అనుకున్నాను కానీ, ఓ సినిమాను సక్సెస్ఫుల్గా తీస్తేనే సక్సెస్ అని తను ఈరోజు అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు తుది మెరుగులు దిద్ది ఇక్కడకు తీసుకొచ్చిన స్పార్క్ సీఇఓ సాగర్గారికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నా అని అన్నారు. తన నిర్మాతలు రాజుగారు, కిషన్గారు, దేవీగారు, తలశిల, దిలీప్గారు, ఇలా అందరికీ థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. తనను భరించి, ప్రేమించి తనతో నడిచిన తన టీమ్కు థాంక్స్ అని, థియేటర్స్లో ఈ ఆగస్ట్ 13న విడుదలవుతున్న కనబడుటలేదు సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.
స్వప్న మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన విజయేంద్రప్రసాద్గారికి, రామ్గోపాల్ వర్మగారికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ట్రైలర్ చాలా బావుందని, కనబడుటలేదు ఈ నెల 13న థియేటర్స్లో కనిపించనుందని, ప్రేక్షకులు సినిమాను వీక్షించాలని కోరుకుంటున్నా అని అన్నారు.
అరుణ్ అదిత్ మాట్లాడుతూ, స్పార్క్లాంటి సంస్థలు ఇంకా మరిన్ని రావాలి అని అన్నారు. అప్పుడే డిఫరెంట్ కంటెంట్ను తీసుకురావడానికి స్కోప్ ఉంటుందని, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రేక్షకులు ప్రూవ్ చేశారని, అలాగే ఆగస్ట్ 13న విడుదలవుతున్న కనబడుటలేదు సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.
సంగీత దర్శకుడు మధు పొన్నాస్ మాట్లాడుతూ, నా మ్యూజిక్ను నాకంటే డైరెక్టర్ బాలరాజుగారే ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటారు అని అన్నారు. మంచి టీమ్తో పనిచేసినందుకు హ్యాపీగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
స్పార్క్ ఓటీటీ అధినేత, నిర్మాత సాగర్ మంచనూరు మాట్లాడుతూ, కార్యక్రమానికి వచ్చిన విజయేంద్రప్రసాద్గారికి, రామ్గోపాల్ వర్మగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని అన్నారు. కనబడుటలేదు తనకు చాలా స్పెషల్ అని, స్పార్క్లో ఫస్ట్ రిలీజైన మూవీ వర్మగారు చేసిన డి కంపెనీ అయితే తను ఫస్ట్ సైన్ చేసిన మూవీ కనబడుటలేదు అని తెలిపారు. చాలా స్పెషల్ కేర్ తీసుకున్నామని, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చారని తెలిపారు. మధు పొన్నాస్గారి సంగీతం విన్న తర్వాతే ఈ సినిమాను తీసుకోవాలనిపించింది అని అన్నారు. టాలెంటెడ్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ బాలరాజు గారు రిలీజ్ చేసిన టీజర్ ను చూసిన తర్వాత చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది అని, ఆయనకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని అన్నారు. హీరోయిన్ వైశాలి రాజ్, తొలి సినిమా హీరోయిన్లా కాకుండా మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చేసిందాని, కథలో చాలా బలముందనిపించడంతో సినిమాను ఇంకా పెద్ద లెవల్లో చేయాలనిపించింది అని అన్నారు. అప్పుడే సునీల్, హిమజ, రవివర్మగారిని టీమ్లోకి యాడ్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. సునీల్గారి పెర్ఫామెన్స్ నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది, ఆయన సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లారు, అలాగే సుక్రాంత్ చాలా బాగా నటించాడు, ఇక సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు. ఆగస్ట్ 13న థియేటర్స్లో సినిమా విడుదలవుతుంది. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, కనబడుటలేదు చాలా బాగా కనబడుతుంది, కొత్త దర్శకుడిలా బాలరాజు కనపడటం లేదు, తనెందుకు ఈ టైటిల్ పెట్టాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని అన్నారు. స్పార్క్ సాగర్లాంటి నిర్మాత దొరకడం ఈ టీమ్కు అదృష్టమని, ఎందుకంటే తను ఓసారి కమిట్మెంట్ ఇస్తే, తర్వాత తన మాట తను కూడా వినడు అని అన్నారు. వైశాలిరాజ్ చాలా మంచి నటి, తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, సుక్రాంత్ బాగా యాక్ట్ చేశాడు. యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు రామ్ గోపాల్ వర్మ.