రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ , పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
‘మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి.. తనకు తెలియని ప్రపంచాన్ని కూడా భుజాలపై ఎక్కించుకుని మరీ మనకు చూపించేది తండ్రి’.. అంటూ ట్రైలర్ ప్రారంభంలో హీరో చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తరువాత ‘సరిగ్గా లేనివాటిని సవరించడం నా కర్తవ్యం.. న్యాయాన్ని కాపాడటం నా వృత్తి’ అంటూ హీరో కారెక్టరైజేషన్ను చెప్పే డైలాగ్.. ‘మనసుని కాకుండా మనిషి అలవాట్లను ప్రేమించే నువ్వు మార్పు గురించి మాట్లాడకు’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పే ఎమోషనల్ డైలాగ్తో కథలోని ఎమోషన్ అర్థం అవుతుంది. సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి.


