స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప” బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్ కూడా రికార్డులు సృష్టించాయి. ఇక సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా” అయిటే యూట్యూబ్ను షేక్ చేసింది. అయితే ఈ పాటను సింగర్ మంగ్లీ సోదరి సింగర్ ఇంద్రావతి చౌహాన్ పాడగా, అందుకుగాను తాజాగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్వుండ్ వారి గోల్డ్ మెడల్ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్వుడ్ సంస్థ ఈ ఏడాది 19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్కు గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేయనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్వుడ్ గోల్డ్ మెడల్ ప్రదానోత్సవానికి సింగర్ ఇంద్రావతిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఇంద్రావతి మే 22న ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నానని, నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని అని, ఇది నిజంగా గర్వించే విషయమని చెప్పుకొచ్చింది.