సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భుజానికి తాజాగా శస్త్ర చికిత్స జరిగింది. గత ఆరు నెలలుగా బాలకృష్ణ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. అయితే నొప్పి తీవ్రం కావడంతో అక్టోబరు 31వ తేదిన చికిత్స నిమిత్తం ఆయన బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి సర్జరీని పూర్తి చేశారు.
అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా ప్రముఖ ఓటీటీ ఆహాలో వచ్చే “అన్ స్టాపబుల్” కార్యక్రమానికి బాలయ్య హోస్ట్గా వ్యవహరించబోతున్నారు.