దర్శకరత్న దాసరి నారాయణరావు గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యతో జనవరి 29న హాస్పిటల్లో చేరి చెస్ట్ ఆపరేషన్ చేయించుకున్న ఆయన నిన్న సాయంత్రం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఆరోగ్యం బాగుందని, ఇక ఎలాంటి సమస్య ఉండదని అక్కడి వైద్యులు అధికారికంగా తెలిపారు.
అలాగే ఆయన ఇకపై పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కిమ్స్ ఎండీ, ఇన్నాళ్లు దాసరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన ప్రధాన వైద్యుడు డా. బి. భాస్కర్ రావు తెలిపారు. డిస్చార్జ్ వెంటనే దాసరి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను కలిసి పరామర్శించి హర్షం వ్యక్తం చేశారు.