ఆ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో సూర్య నటించడంలేదట !

ఆ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో సూర్య నటించడంలేదట !

Published on Mar 28, 2017 4:56 PM IST


‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై విమర్శకుల ప్రసంశలు అందుకున్న నాగ్ అశ్విన్ తన తరువాతి సినిమాగా మహానటి సావిత్రి జీవితగాథను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న నైపథ్యంలో గత రెండు రోజులుగా తమిళ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో సావిత్రి భర్తైన జెమినీ గణేశన్ పాత్రలో కనిపిస్తారని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని రూఢీ అయింది.

సూర్యకు మిత్రుడు, 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ పాండియన్ ఈ వార్తపై స్పందిస్తూ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ తో చేయనున్న తన తరువాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని, ఇది ఒట్టి పుకారేనని తేల్చారు. దీంతో నిన్న మొన్నటి నుండి నడుస్తున్న ఉత్కంఠకు తెరపడ్డట్టైంది. ఇకపోతే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, మరొక కీలక పాత్రలో సమంత నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు