
మోహల్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం.. ‘దృశ్యం’. చాలా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఈ సినిమాను అదే పేరుతో విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయగా ఇక్కడా మంచి విజయం సాధించి పెట్టింది. ఇప్పుడీ సినిమాను దృశ్యం మాతృక దర్శకుడు జీతూయే ‘పాపనాశం’ పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్నారు. కమల్ హాసన్, గౌతమిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్పై ఉంది. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
సతీష్ పాల్ అనే రచయిత తన ‘ఒరు మాకకలథు’ కథను కాపీ కొట్టి దృశ్యం సినిమాను నిర్మించారని కోర్టుకెక్కారు. దృశ్యం తమిళ రీమేక్ను ఆపివేయాల్సిందింగా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ఎర్నాకులం కోర్టు విచారణ చేపట్టి కేసును కొట్టివేసింది. జీతూ జోసెఫ్ వాదనను సమర్దించిన కోర్టు, కేసును కొట్టేసింది. ఇక దీంతో సినిమాకి సంబంధించిన న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయ్. ఇప్పటికే పాపనాశం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ వేసవికే సినిమాను విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు.

