మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు ‘మనమంతా’, ‘జనతా గ్యారెజ్’ సినిమాలతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనమంతా’ అనే డిఫరెంట్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నలుగురు ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తుల జీవితాలను స్పృశించే ఆసక్తికర కథనంతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ఈ ఉదయం విడుదలైంది. ఈ టీజర్ను మెచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి, సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు.
చంద్రశేఖర్ ఏలేటి, మోహన్ లాల్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే సినిమాపై ఆసక్తి కలుగుతోందని, సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని రాజమౌళి తెలిపారు. ఇక మోహన్ లాల్తో పాటు గౌతమి, ‘కేరింత’ ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించారు. టీజర్ విడుదల సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని మనమంతా టీమ్ స్పష్టం చేసింది.