
బ్లాక్బస్టర్ నిర్మాత బండ్ల గణేష్, రామ్ చరణ్ల స్నేహం మనకు తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా నిర్మాణ క్రమంలో.. చిరంజీవి, రామ్ చరణ్లతో గల బంధాన్ని వీలు చిక్కినప్పుడల్లా వ్యక్తపరిచాడు బండ్ల గణేష్. కాగా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తమ స్నేహం విలువ మరోసారి ప్రకటించాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగా అభిమానులు చెర్రీ పేరు మీద చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి రక్తదానం చేశారు. ఇదే శిబిరంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా రక్తదానం చేశాడు. చెర్రీ పుట్టినరోజున అతని పేరు మీద ఒక మంచి పని చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపాడు. ఇక బండ్ల గణేష్ తన గత చిత్రం టెంపర్ విజయంతో ఖుషీగా ఉండగా, చెర్రీ కొంత రెస్ట్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్నాడు.

