
తెలుగు సినిమాల్లో కాంబినేషన్ అనేది వర్కవుట్ అయినట్టుగా మరెక్కడా కాదు. ఆ క్రమంలోనే ఈమధ్య ఒక క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణరావు, పవన్ కళ్యాణ్ల కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. దాసరి నిర్మాతగా, పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఇండస్ట్రీలో చర్చ, ఆసక్తి ఒకేసారి రేకెత్తాయి. అయితే ప్రకటన విడుదలై చాలా రోజులే అయినా ఇప్పటికీ ఆ విషయం ముందుకు సాగలేదు. ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఇక తాజా సమాచారం మేరకు ఈ ప్రశ్నలన్నింటికీ తెరపడనుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్తో ‘గోపాల గోపాల’ సినిమాని తెరకెక్కించిన డాలీ (కిషోర్ పార్థసాని), దాసరి-పవన్ల సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గోపాల గోపాల తర్వాత పవన్, డాలీతో ఓ సినిమాకు సిద్ధపడడం, స్క్రిప్ట్ కూడా రెడీ చేయమనడం తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టును దాసరి తన సొంత ప్రొడక్షన్లో తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.

