ఈనెల 5న శిల్పకళా వేదికలో దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్!

ఈనెల 5న శిల్పకళా వేదికలో దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్!

Published on May 1, 2024 10:49 AM IST

నాలుగన్నర దశాబ్దాల తన సినీ ప్రయాణంలో దశ ముఖాలుగా ప్రతిభ కనబరిచి, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా భాసిల్లిన దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా అంగరంగవైభవంగా జరుగుతున్న దర్శకరత్న డి.ఎన్.ఆర్.ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు వేలాదిగా తరలి రావాలని ప్రముఖ నటులు మురళి మోహన్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిచ్చారు.

ఈనెల 5న శిల్పకళావేదికలో నిర్వహిస్తున్న ఈ వేడుక లోగోను ఈ సందర్భంగా వారు సంయుక్తంగా ఆవిష్కరించారు. దాసరికి ఘన నివాళి ఇవ్వడం, సినిమారంగంలో రాణించాలని ఉవ్విళ్లూరే నేటి తరంలో స్ఫూర్తిని నింపడం. ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యాలుగా వారు ఉద్ఘాటించారు. దశముఖాలుగా రాణించిన దాసరి స్మారకార్ధం దశ రంగాల్లో రాణిస్తున్న వారికి దాసరి లెజండరి అవార్డ్స్ ప్రదానం చేయడంతోపాటు, 2023లో విడుదలైన చిత్రాల్లోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ అందజేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు, లబ్ధప్రతిష్టులు ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

ఈ సమావేశంలో కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు,ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, కార్యక్రమ సంధానకర్త – ప్రముఖ నటులు ప్రదీప్, జ్యురీ మెంబర్స్- ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ పాల్గొని, వేడుకను విజయవంతం చేయవలసిందిగా పరిశ్రమ పెద్దలకు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చైర్మన్ గా ఉన్న జ్యురీ కమిటీలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ నటులు ప్రదీప్, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు