‘అవును’ ఫేమ్ పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరికృష్ణ నిర్మిస్తోన్న చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. నూతన దర్శకుడు అన్నం చిన్నికృష్ణ ఈచిత్రాన్ని తెరెకెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మాటల రచయిత మరుధూరి రాజా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా నిర్మాత ఫాదర్ ఇ.రమేష్ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ `నేను తెలుగులో పలు చిత్రాలను రిలీజ్ చేశాను. తొలిసారిగా నిర్మాతగా మారి ఈ సినిమా నిర్మిస్తున్నా. మా దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి పూర్ణ గారైతే పర్ఫెక్ట్ యాప్ట్ అని ఆమెను తీసుకున్నాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసి సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు అన్నం చిన్నికృష్ణ మాట్లాడుతూ `డైరక్టర్ గా ఇది నా తొలి సినిమా. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ గా సినిమా చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర కావడంతో పూర్ణ గారిని తీసుకున్నాం కచ్చితంగా ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నాం అన్న ధీమాతో ఉన్నాం అన్నారు. నటి పూర్ణ మాట్లాడుతూ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ ఎంతో అభిరుచి ఉన్న వ్యక్తులు. సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోన్న తరుణంలో ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఇందులో నా క్యారక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నారు.