‘జూ ఎన్టీఆర్’కు అభిమానులంటే ఎంత అభిమానమో, ఎంతటి గౌరవమో మరోసారి రుజువైంది. కృష్ణా జిల్లా ఎన్టీయార్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మృతి చెందారు. ఆయన మరణం పట్ల ఎన్టీయార్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. తన కెరీర్ మొదట్నుంచి ఆయన తనకు అండగా ఉన్నారని, ఆయన లేని లోటు తనకు తీరదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎన్టీయార్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
‘నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. నిన్ను చూడాలనితో మొదలైన మా ప్రయాణం ఇలా అర్థంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. నటుడిగా నేను చూసిన ఎత్తుపల్లాల్లో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్ చాలా ముఖ్యమైనవారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’ ఎన్టీయార్ తెలిపారు.