‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్ హీరోగా ఎల్ఆర్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణరావు బూరగాపు నిర్మిస్తోన్న చిత్రం ‘కనకం 916 కేడియమ్’. రాకేష్ పోతాప్రగడ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. వైశాఖి బోనం హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నివ్వగా, చిత్ర నిర్మాత లక్ష్మణరావు బూరగాపు కెమేరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో రాహుల్ రవీంద్రన్, ప్రముఖ నిర్మాతలు బివియస్ఎన్ప్రసాద్, రాజ్ కందుకూరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత లక్ష్మణరావు బూరగాపు మాట్లాడుతూ…‘‘రాకేష్ ఓ రోజు వచ్చి కనకం స్టోరి లైన్ చెప్పాడు. తను చెప్పిన స్టోరీతో పాటు దర్శకుడవ్వాలన్న తన తపన నచ్చి ఈ అవకాశం కల్పించాను. కేరాఫ్ కంచరపాలెంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ భగత్ హీరోగా నటిస్తున్నారు. అలాగే టెక్నిషీయన్స్ కూడా ప్రతిభావంతులు పని చేస్తున్నారు. ఇందులో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకుకు నచ్చే సినిమా అవుతుందన్నారు.
సంపూర్ణేష్ బాబు, సీనియర్ నరేష్, పోసాని, జీవా, రవిబాబు, శివసూర్య, దేవీప్రసాద్, దీక్షితులు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రాయల్ రాజ్, ఎడిటింగ్: తమ్మిరాజు; సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు; నిర్మాత: లక్ష్మణరావు బూరగాపు; రచన-దర్శకత్వం:రాకేష్ పోతాప్రగడ.


