మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోకి ఉదయపూర్ నందు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా కుటుంబలన్నీ వేడుకకు చేరుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరు మెగా హీరోలు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. నిన్నటి నుండే ప్రీవెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.
హీరోలంతా ఆటలు పాటలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వేడుకకు పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదా అనే సందేహం కొనసాగుతూ వచ్చింది. పవన్ రైతుల కోసం దీక్షలు, పర్యటనలు లాంటి రాజకీయ కార్యక్రమాల హడావిడిలో ఉండటంతో ఆయన వివాహారానికి వెళ్లలేరని కొందరు, వెళ్తారని కొందరు అంటూ వచ్చారు. అయితే పవన్ పనులన్నింటినీ ముగించుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఉదయపూర్ బయలుదేరారు. ఇంకాసేపట్లో ఆయన ఉదయపూర్ చేరుకొని వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. నిహారిక సహా మెగా కుటుంబ సభ్యులంతా పవన్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉదయ్ విలాస్లో డిసెంబర్ 9న అనగా రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది.


