ఈ ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడి “పెళ్లిసంద‌D” ఫస్ట్ సింగిల్.!

ఈ ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడి “పెళ్లిసంద‌D” ఫస్ట్ సింగిల్.!

Published on Apr 25, 2021 4:59 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు. మరి అలాంటి దర్శకుని జీవితంలో ఏప్రిల్‌28 వ తారీఖుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఏప్రిల్‌28 క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన `అడివిరాముడు` రిలీజైన రోజు.

అదే ఏప్రిల్‌28 ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర‌ చరిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించి బాక్సాఫీస్ రికార్డుల‌కు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి 2` విడుద‌లైన రోజు. ఇలాంటి ఒక అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సార‌థ్యంలో రూపొందుతున్న `పెళ్లిసంద‌D` పాట‌ల సంద‌డి మొద‌ల‌వుతుంది.

అప్పుడు 1996లో విడుద‌లై ఏడాదిపాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌విజ‌యాన్ని సాధించ‌డ‌మేకాక పాతికేళ్లుగా బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది నాటి `పెళ్లిసంద‌డి`. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడు మ‌ళ్లీ `పెళ్లి సంద‌D` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది ఆ పెళ్లిసంద‌డికి సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త క‌థ‌. నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి `పెళ్లిసంద‌D`లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం.

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌రవాణి కీర‌వాణి కాంభినేష‌న్‌లో అప్ప‌టి `పెళ్లిసంద‌డి` పాట‌లు ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ `పెళ్లిసంద‌D`కి కూడా కీర‌వాణి సంగీతం అందించ‌డం విశేషం.ఈ ఏప్రిల్‌28న రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `పెళ్లిసంద‌D`లోని ఓ పాట‌ను విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ పాట‌తో మ‌రోసారి కె. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల పాట‌లసంద‌డి మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. అలాగే ఈ చిత్రం షూట్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిందట.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్‌, సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి, సాహిత్యం: చంద్ర‌బోస్, ఆర్ట్‌: కిర‌ణ్, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,‌ ఫైట్స్‌: వెంక‌ట్, కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె. సాయిబాబా‌, బేన‌ర్స్‌: ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్, స‌మ‌ర్ఫ‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌, నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ, ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోనంకి లు వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు