బాలీవుడ్ స్టార్ నటుడు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పలు పరీక్షల తర్వాత ఆయనకు ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అని నిర్థారించారు వైద్యులు. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే నిజంగా ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టే. ఇది తెలిసి అభిమానులు, సినీ జనం ఎంతో వేదన చెందారు. ఆయన కోలుకోవాలని ప్రార్థించారు. చివరి అందరి ప్రార్థనలు ఫలించి సంజూ బాబా కోలుకున్నారు. కోలుకోవడం అంటే అలా ఇలా కాదు. క్యాన్సర్ను పూర్తిగా జయించాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు.
‘బలమైన యోధులకే దేవుడు పెద్ద పెద్ద పరీక్షలు పెడతాడు. గత కొన్ని వారాలుగా నా కుటుంబానికి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు నా పిల్లల పుట్టినరోజు. అందుకే మీ అందరికీ ఓ ముఖ్య విషయం చెప్తున్నాను. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. ఇదే వారికి నేనిచ్చే పెద్ద గిఫ్ట్. మీ అందరి ప్రేమాభిమానాలు లేకపోతే ఈ గెలుపు సాధ్యమయ్యేదే కాదు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కోకిలాబెన్ ఆస్పత్రిలో నాపై ప్రత్యేక శ్రద్ధ చూపి చికిత్స అందించిన డాక్టర్ సేవంతి, ఆమె బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. సంజయ్ ప్రకటనతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే సంజయ్ దత్ ‘కెజిఎఫ్ 2’తో పాటు మొత్తం 6 సినిమాల్లో నటిస్తున్నారు.