సాయి సింహాద్రి సైన్మా బ్యానర్పై సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘S/O’ (సన్ ఆఫ్). బత్తల సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇది రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదని, పూర్తిగా స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే తండ్రీకొడుకుల కథని వినోద్ కుమార్ తెలిపారు.
సినిమాపై మక్కువతో అమెరికా నుంచి వచ్చి సాయి సింహాద్రి ఈ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు సతీష్ కథను తీర్చిదిద్దిన విధానం అద్భుతమని, తన కెరీర్లో ఇది మరో ‘మామగారు’ స్థాయి సినిమా అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను గోపీచంద్తో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే సుహాసినితో మరో చిత్రం చేస్తున్నట్లు వినోద్ కుమార్ వెల్లడించారు.
తండ్రిపై కొడుకు ఎందుకు కేసు వేశాడనే ఆసక్తికరమైన పాయింట్తో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు సతీష్ తెలిపారు. ఈ కథ తన నిజ జీవితానికి, తన తండ్రితో ఉన్న అనుబంధానికి దగ్గరగా ఉంటుందని హీరో సాయి సింహాద్రి పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానినైన తాను, ఈ చిత్రాన్ని ఆయనకు చూపించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు చిత్రం శీను, రిషి తదితరులు పాల్గొన్నారు.


