పూజా కార్యక్రమాలతో మొదలైన “తిండిబోతు దెయ్యం”

పూజా కార్యక్రమాలతో మొదలైన “తిండిబోతు దెయ్యం”

Published on Apr 30, 2024 8:05 AM IST


నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తన ప్రొడక్షన్ నెం.1గా తిండిబోతు దెయ్యం అనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకులు, నంది అవార్డు గ్రహీత రేలంగి నరసింహారావు క్లాప్ నివ్వగా, నిర్మాత శిరీష నరసింహ బోదాసు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్బంగా ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, “కామెడీ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంశమే. చలనచిత్ర సీమలో కామెడీకి తిరుగులేదు, ఉండదు కూడా. అయితే, దీనిని చక్కగా డీల్ చేసి తీస్తే విజయభావుటా ఖాయం. కామెడీ టచ్ తో కూడిన చిత్రానికి హర్రర్ మిళితం చేస్తే, ఇక చెప్పేదేముంటుంది? ప్రేక్షకుల మనసులను ఇట్టే దోచేయొచ్చు. ఇప్పుడు సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. నాకు తెలిసి దర్శకులు నరసింహ బోదాసు ఈ చిత్రానికి ఎంతో మంచి స్క్రిప్ట్ ను సమకూర్చుకుని ఉంటారు. కామెడీతో కూడిన హర్రర్ అంటున్నారు కాబట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకునే విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నరసింహ బోదాసు అందులో నేర్పరి. ఎలాంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అలాగే ఈ చిత్రానికి కథానాయికలు కూడా చక్కగా కుదిరారు. హీరోయిన్స్ ను చూస్తూంటే ముచ్చెటేస్తుంది. ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ముఖ్యంగా ఏ సినిమాకైనా ప్లానింగ్ ఎంతో అవసరం. ఈ సినిమాలో నరసింహ బోదాసు కు తోడు నందుటి అశోక్ గౌడ్ ఉన్నారు కాబట్టి చక్కటి ప్లానింగ్ తోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని ఆశిస్తున్నాను. విడుదలకు ముందు సినిమాకు మంచి ప్రమోషన్ ఇచ్చుకుంటూ, సోషల్ మీడియాను బాగా వాడుకుని ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ తిండిబోతు దెయ్యం కనిపించాలని, వినిపించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

నిర్మాత, దర్శకులు, హీరో నరసింహ బోదాసు మాట్లాడుతూ, “కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని మంచి చిత్రాలు నిర్మించాలని ఈ నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ ను స్థాపించాం. ప్రొడక్షన్ నెం.1గా మా తిండిబోతు దెయ్యం ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాలో కొత్తదనం ఉంటుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు” అని తెలిపారు.

కథానాయికలు మౌనిక, వాసవి మాట్లాడుతూ, ఈ కామెడీ హర్రర్ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తమ పాత్రలను చక్కగా పోషించి అందరి అభిమానాన్ని చాటుకుంటామని, ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

కో డైరెక్టర్ నందుటి అశోక్ గౌడ్ మాట్లాడుతూ, కామెడీ హర్రర్ తో వస్తున్న ఈ తిండిబోతు దెయ్యం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడం ఖాయం. కొత్త జోనర్ లో, సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ ని త్వరలోనే చూస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమావేశంలో డైలాగ్ రైటర్ శ్రీకాంత్ సాయి మాట్లాడుతూ, సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని, శ్రీ శౌర్య క్రియేషన్స్ ద్వారా మరిన్ని చిత్రాలు రావాలని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు