స్టార్ డైరెక్టర్ వినాయక్ సినిమా నట సింహం నందమూరి బాలకృష్ణతో ఎప్పుడో సంవత్సరం క్రితం మొదలవ్వాల్సింది. కానీ వినాయక్ కి పరిస్థితులు పెద్దగా అనుకూలించలేదు. హీరో, నిర్మాత ఒకే అయ్యాక కూడా కథ కుదరక.. ఎట్టకేలకూ ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా వినాయక్ మాత్రం మంచి ప్రాజెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఓ మల్టీస్టారర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. అదీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేద’. తమిళంలో ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా, శ్రద్ధా శ్రీనాథ్ – వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ – నారా రోహిత్ హీరోలుగా నటించనున్నారు. అయితే మాధవన్ పాత్రలో నారా రోహిత్, విజయ్ సేతుపతి పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారట. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతన్నారని సమాచారం.
ఇక గతంలో వెంకటేష్ తో కలిసి ‘లక్ష్మి’ సినిమాను రూపొందించాడు వినాయక్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈసారి వెంకీకి వినాయక్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.