‘దోచేయ్‌’లో చైతూది డ్యూయల్ రోలా?!

‘దోచేయ్‌’లో చైతూది డ్యూయల్ రోలా?!

Published on Apr 1, 2015 5:50 PM IST

Dochey
‘స్వామిరారా’.. 2013లో విడుదలైన ఈ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ టేకింగ్ సినీ పరిశ్రమను అబ్బురపరచింది. ఆ విజయం తర్వాత సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘దోచేయ్’ పేరుతో ఓ క్రైమ్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘స్వామిరారా’ సినిమాలో చూపినట్టుగానే సుధీర్ తన మార్క్ మేకింగ్‌ను ‘దోచేయ్’ టైటిల్‌ నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘స్వామిరారా’ సినిమా చూసిన వారికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారన్నది చెప్పాల్సిన పనిలేదు.

ఆ రకంగా టైటిల్‌ నుంచే కొత్తదనం చూపెట్టిన సుధీర్, ‘దోచేయ్’ సినిమాలోనూ అదే కొత్తదనం చూపనున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా గమనిస్తే ‘దోచేయ్’ టైటిల్‌లో ‘దో’, ‘చేయ్’ కలిపే రాసినా రెండింటికీ మధ్య తేడా వచ్చేలా అక్షరాల్లో రంగుల మార్పు చూడొచ్చు. ‘చేయ్’, ‘చైతూ’ నాగచైతన్యను ముద్దుగా పిలిచే పేర్లు. ‘దో’ అంటే రెండని అర్థం. ఆ విధంగా సినిమాలో నాగచైతన్య డ్యూయల్ రోల్ చేయనున్నాడని చెప్పకనే చెబుతున్నారని అభిమానుల టాక్. సినిమా ట్రైలర్‌లో చెప్పినట్టు ‘ప్రతీ మోసం వెనుక ఇద్దరుంటారు. మోసం చేసేవాడు, మోసపోయేవాడు’ అన్న లైన్‌ ప్రకారం ఆ రెండు పాత్రలనూ చైతూయే చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే, ఇందులో నిజం ఎంతుందన్నది తెలియాలంటే ఏప్రిల్ 24 దాకా ఆగాల్సిందే! ఈ సినిమాలో చైతూ సరసన కృతిసనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు