పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో నటిస్తూనే, తన రాజకీయ పార్టీ అయిన జనసేన తరపున ప్రజా పోరాటాలు కూడా చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంపై పవన్ బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శించారు. పేదలకు ఈ చర్య వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముందస్తు జాగ్రత్తలేవీ తీసుకోకపోవడం వల్ల ఎన్నోచోట్ల ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్తో పాటు, ఆయన జనసేన పార్టీ కూడా విమర్శిస్తూ వస్తోంది.
ఇక తాజాగా నోట్ల రద్దు ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పవన్ జనసేన పార్టీ రంగంలోకి దిగింది. నిన్న హైద్రాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో జనసేన కార్యకర్తలు రద్దైన 500, 1000 రూపాయల నోట్లతో కనిపించిన రోగుల కుటుంబాలకు చిల్లర మొత్తాన్ని ఇచ్చి నోట్లను మార్పించారు. జనసేన కార్యకర్తలు కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం కోసమే 100 నోట్ల సేకరణను మొదలుపెట్టారు. ఇక ఈ మంచి పనిని పవన్ సైతం అభినందిస్తూ జనసేన తరపున ఇలాంటివి మరిన్ని మంచి పనులు జరగాలని పిలుపునిచ్చారు.