యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ రెండు సినిమాలను లైన్లో పెట్టి ఆ రెండు సినిమాలనూ ఒకేసారి పూర్తి చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండునెలల క్రితం ‘మిస్టర్’ షూటింగ్లో గాయపడడంతో ఆయన యాభై రోజులు పూర్తిగా విశ్రాంతికే పరిమితం అయ్యారు. ఇక ఈ గ్యాప్లో మిస్టర్, ఫిదా రెండు సినిమాలూ ఆగిపోయాయి. ఇప్పుడు గాయం నుంచి కోలుకొని, పూర్తి ఫిట్నెస్తో వరుణ్ రెడీ అయిపోవడంతో మళ్ళీ మిస్టర్, ఫిదాలు షూటింగ్తో కళకళలాడుతున్నాయి. ఈమధ్యే హైద్రాబాద్లో మిస్టర్కు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి చేసిన వరుణ్, తాజాగా ఫిదా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.
కామారెడ్డిలోని బాన్సువాడ ప్రాంతంలో ప్రస్తుతం వరుణ్ తేజ్ పాల్గొంటుండగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగులో సెన్సిబుల్ దర్శకుల్లో ఒకరుగా పేరున్న శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు. ఒక గ్రామీణ అమ్మాయికి, ఎన్నారై అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమా ప్రచారం పొందుతోంది. వరుణ్ తేజ్ సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు.