‘ఒక ఊరిలో’ సినిమా దర్శకుడిగా తన కెరీర్ను స్టార్ట్ చేసిన డైరెక్టర్ రమేశ్ వర్మ పెన్మత్స.. తర్వాత ‘రైడ్, అబ్బాయితో అమ్మాయి, వీర’ చిత్రాలను తెరకెక్కించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’తో సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ దర్శకుడు ఇప్పుడు రవితేజతో ‘ఖిలాడి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా రమేశ్ వర్మ ఇంటర్వ్యూ విశేషాలు…
కోవిడ్ సమయం.. ఏదో కొత్త నిర్ణయాలు తీసుకునేంత ఎగ్జయిటింగ్గా ఏమీ లేవు. అందరిలో టెన్షన్ ఉంది. ఖిలాడి సినిమా టాకీ పార్ట్కు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశాం.
– లైఫ్లో అందరికీ డబ్బు అనేది చాలా ముఖ్యం. జీవితంలో డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వాలా లేక భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలా.. లేక రెండు ముఖ్యమా? అని ఆలోచింప చేసేలా రెండు పాత్రలుంటాయి. అదే ఖిలాడి సినిమా.
ఖిలాడిలో రవితేజగారు డ్యూయెల్ రోల్ చేస్తున్నారా? లేక ట్రిపుల్ రోల్ చేస్తున్నారా? అనే విషయాన్ని ఇప్పట్లో చెప్పను. సినిమా చూడాల్సిందే. అయితే రవితేజగారు ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది కొత్తది.
నేను డైరెక్టర్ కాకముందు డిజైనర్గా ప్రతి ఏడాది వంద సినిమాలకు పని చేసేవాడిని. ప్రారంభంలో డైరెక్టర్గా నేను సంపాదించిన దానికంటే డిజైనర్గానే ఎక్కువ సంపాదించాను అని చెప్పాలి. డైరెక్టర్గా అవకాశాలు కావాలని నేను ఎవరినీ కలవలేదు. ముందు చంటిగారు, తర్వాత బెల్లంకొండ సురేశ్గారు, …అలా డైరెక్టర్గా జర్నీని స్టార్ట్ చేసినా సీరియస్గా తీసుకోలేదు. అయితే రాక్షసుడు సినిమా నుంచి డైరక్షన్ను సీరియస్గా తీసుకున్నాను.
నా కెరీర్లోనే కాదు, రవితేజగారి కెరీర్లోనూ ఇది భారీ బడ్జెట్ మూవీ. రూ.65 కోట్లు ఖర్చు పెట్టాం. స్పాన్ ఉన్న సినిమా. టెక్నికల్గా కూడా సినిమా చాలా బావుంటుంది.
ఖిలాడి సినిమాకు స్ఫూర్తి ఏమీ లేదు. సినిమా పాయింట్ అనుకున్న తర్వాత అలాంటి కాన్సెప్ట్ మూవీ తమిళంలోనూ సినిమా స్టార్ట్ అయ్యిందని తెలిసింది. ప్యూర్ మూవీ ఇది రీమేక్ కాదు. రవితేజగారు చేస్తేనే ఈ సినిమా వర్కవుట్ అవుతుంది. కథ అనుకోగానే, రవితేజగారినే హీరోగా అనుకున్నాం. రాక్షసుడు2 కోసం విజయ్ సేతుపతితో మాట్లాడాము. ఆయన వెయిట్ చేయమని అన్నారు. సరైన సమయంలో సినిమాను సెట్స్పైకి తీసుకెళతాం. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను చేస్తాం.