వరల్డ్ కప్ గెలవడం ఒక ఎత్తయితే.. ఫైనల్ లాంటి మెగా ఫైట్లో ఆడిన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అహ్మదాబాద్లో కివీస్పై టీమిండియా సాధించిన విజయం కేవలం ట్రోఫీకి మాత్రమే పరిమితం కాలేదు. ఆధునిక టీ20 క్రికెట్ను ఎలా ఆడాలో ప్రపంచానికి ఒక కొత్త పాఠం నేర్పింది. ఒకప్పుడు ఫైనల్స్ అనగానే విపరీతమైన ఒత్తిడి, ఆచితూచి ఆడటం చూసేవాళ్లం. కానీ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ యువ భారతం పాత మూస పద్ధతులను బద్దలు కొట్టింది. ఏకంగా 255 పరుగులు సాధించి, టీ20 ఫార్మాట్ టెంప్లేట్ను పూర్తిగా మార్చేసింది.
మొదటి బంతి నుంచే అటాకింగ్.. ఇదే ఇప్పుడు టీమిండియా కొత్త మంత్రం. పవర్ప్లేలో వికెట్లు కాపాడుకోవాలనే పాత సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తొలి 6 ఓవర్లలోనే 92 రన్స్ రాబట్టడం కుర్రాళ్ల అగ్రెసివ్ మైండ్సెట్కు అద్దం పడుతోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్.. ఇలా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ బౌండరీలే లక్ష్యంగా చెలరేగారు. ఇది కేవలం ఒక రోజులో వచ్చిన మార్పు కాదు. గత రెండేళ్లుగా మేనేజ్మెంట్ నూరిపోసిన ‘ఫియర్లెస్ క్రికెట్’ (భయం లేని క్రికెట్) ఫైనల్లో నూటికి నూరు శాతం వర్కౌట్ అయింది.
గతంతో పోలికలు వద్దు.. ఇది కొత్త శకం
భారత క్రికెట్ చరిత్రలో 2007, 2024, ఇప్పుడు 2026.. ఈ మూడు సంవత్సరాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. అయితే, ఈ మూడు విజయాల వెనుక ఉన్న ‘క్రికెట్ మైండ్సెట్’ను గమనిస్తే, కాలంతో పాటు టీమిండియా తన ఆటతీరును ఎంతగా ఆధునీకరించుకుందో స్పష్టమవుతుంది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నట్లుగా, ఈ తరం ఆడుతున్న తీరు మునుపటి కంటే భిన్నంగా, అత్యంత వేగంగా సాగుతోంది.
భయం లేని బ్యాటింగ్.. సరికొత్త టెంప్లేట్
2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ తొలిసారి పొట్టి ప్రపంచకప్ను గెలిచినప్పుడు, అది ఒక అద్భుతం. అప్పట్లో బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ, చివరి ఓవర్లలో భారీ హిట్టింగ్కు ప్రాధాన్యత ఇచ్చేవారు. పవర్ప్లేలో 40-45 పరుగులు చేస్తే అది మంచి ఆరంభంగా భావించేవారు. కానీ, 2024లో రోహిత్ శర్మ హయాంలో ఆ పద్ధతి మారింది. పరిస్థితిని బట్టి దూకుడు పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ సేన దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫైనల్లో కివీస్పై పవర్ప్లేలోనే 92 పరుగులు బాదడమే దీనికి నిదర్శనం.
స్కోర్ బోర్డుపై మారిన అంచనాలు
ఒకప్పుడు టీ20ల్లో 150 నుంచి 160 పరుగులు చేస్తే అది ‘విన్నింగ్ స్కోర్’ అని అంతా నమ్మేవారు. 2007 ఫైనల్లో భారత్ 157 పరుగులే చేసింది. కానీ 2024 నాటికి అది 170-180కి పెరిగింది. ప్రస్తుత సూర్య శకంలో 200 పరుగులు కూడా తక్కువే అన్నట్లుగా బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. 2026 ఫైనల్లో నమోదైన 255 పరుగుల భారీ స్కోరు, టీమిండియా పాత రికార్డులను తుడిచిపెట్టడమే కాకుండా, ప్రపంచ క్రికెట్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. ‘డిఫెన్స్’ కంటే ‘అటాక్’ చేయడమే అసలైన గెలుపు మంత్రమని ఈ యువ జట్టు నిరూపించింది.
బౌలింగ్ వ్యూహాల్లో పదును
కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగంలోనూ భారీ మార్పులు వచ్చాయి. 2007లో భారత్ జోగిందర్ శర్మ వంటి పార్ట్-టైమ్ బౌలర్ల తెలివితేటలపై ఆధారపడితే, 2024లో బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి పేసర్లు రక్షకులుగా నిలిచారు. ఇప్పుడు 2026 జట్టులో ప్రతి బౌలర్ ఒక ‘వికెట్ టేకర్’గా మారాడు. పరుగులు నియంత్రించడం కంటే, ప్రత్యర్థిని ఆలౌట్ చేసి మ్యాచ్ను ముగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
మిషన్ 2028: ఒలింపిక్ గోల్డ్ దిశగా..
సాధారణంగా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ మత్తులో నుంచి బయటకు రావడానికి ఆటగాళ్లకు చాలా సమయం పడుతుంది. కానీ కప్పు గెలిచిన గంటల్లోనే కెప్టెన్ సూర్యకుమార్ తమ ముందున్న అసలు టార్గెట్ను బయటపెట్టడం విశేషం. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ రీ-ఎంట్రీ ఇస్తుండటంతో.. అక్కడ గోల్డ్ మెడల్ సాధించడమే తమ నెక్స్ట్ మిషన్ అని సూర్య ప్రకటించాడు. దీన్ని బట్టి చూస్తే జట్టు ఆకలి ఇంకా తీరలేదని, భవిష్యత్తులో ఈ కుర్రాళ్ల దెబ్బకు మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయమని స్పష్టమవుతోంది.


