బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా ‘మే డే’. అయితే ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత అజయ్ దేవగణ్ ఒక్కడే కావడం ఓ విశేషం కాగా, తొలిసారి ఆయన అమితాబ్ బచ్చన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది కావడం మరో విశేషం. అజయ్ దేవగణ్ ఎఫ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధార్ కథానాయికలుగా ఉన్నారు.
అయితే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజే మొదలయ్యింది. అయితే తొలి సన్నివేశానికి అజయ్ దేవగణ్ స్నేహితుడు, ప్రముఖ తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘తానాజీ’ చిత్రానికి సైతం ఆయనే క్లాప్ ఇచ్చారు. ఆ సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అజయ్ దేవగణ్ ఈ రోజు ‘మే డే’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేస్తామని అన్నారు. అయితే భగవంతుడితో పాటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకుంటున్నానని, నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మద్దతుతో పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక ఈ చిత్రానికి పీఆర్వోగా నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) వ్యవహరిస్తుండగా, చిత్రనిర్మాణ సంస్థ అజయ్ దేవగణ్ ఎఫ్ ఫిల్మ్స్, ఛాయాగ్రహణం అశీమ్ బజాజ్, సహ నిర్మాతలుగా కుమార్ మంగత్, విక్రాంత్ శర్మ, హస్నైన్ హుస్సేని, జయ్ కనుజియా, సందీప్ కెవ్లాని, తార్లోక్ సింగ్ ఉన్నారు.


