ఎప్పటినుండో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాలనే కోరిక ఉంది. ఆ క్రమంలోనే మొదట శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో భారతీయుడు-2ను ప్లాన్ చేసినా.. అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు తన నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత నిఖిల్ అద్వానీతో కలిసి హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు.
హేట్ స్టోరీ 4 దర్శకుడు మిలాప్ జావేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత ద్వయం ఇటీవల ఎవడు చిత్రాన్ని చూసారని.. ఈ చిత్రం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగట్లు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మరి హిందీలో రామ్ చరణ్ – అల్లు అర్జున్ పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి.