ఇద్దరు హీరోలతో సినిమా చేస్తే ఆ కిక్కే వేరు – దర్శకుడు అజయ్ భూపతి

ఇద్దరు హీరోలతో సినిమా చేస్తే ఆ కిక్కే వేరు – దర్శకుడు అజయ్ భూపతి

Published on Oct 12, 2021 11:14 PM IST


శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో RX 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మహాసముద్రం”. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. ఈ సినిమాలో అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో ముచ్చటించారు.

ఈ సినిమాలో మహా పాత్రకు కొంతమంది సెట్ అవుతారు. సమంత గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. ముందు ఆమెను కూడా అనుకున్నాను. కానీ చివరకు అదితిరావు హైదరిని తీసుకున్నాను. ఇద్దరు హీరోలతో సినిమా అంటే వచ్చే కిక్ వేరు. ఇద్దరు హీరోలున్న దళపతి, విక్రమ్ వేదా ఇలా ఎన్నో సినిమాలు తెరపై చూస్తే ఏదో తెలియని ఆనందం వేస్తుంది. అలాంటి ఫీల్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని, ఆ కిక్‌ను వారికి మళ్లీ చూపించాలనే సినిమాను తీశానని అన్నారు.

RX100 తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. అవన్నీ పక్కనపెట్టేసి మహా సముద్రం కోసం ట్రై చేశాను. RX100 కంటే ముందే పాయింట్ ఉంది. నేను తరువాత తీయబోయే సినిమా ఇదే అని కార్తికేయకు కూడా సెట్‌లో చెప్పేవాడిని. మహాసముద్రం పూర్తిగా కల్పిత కథ. ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే కథ. కొన్ని పాత్రల మధ్య జరిగే కథ. వైజాగ్‌లో సముద్రానికి ఆనుకుని ఉన్న లొకేషన్లో సాగే కథ. అక్కడి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాల మధ్య జరిగే కథ ఇది అని అన్నారు.

ఏ స్టోరీలో అయినా సరే ఫీమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే అది సక్సెస్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. బాలచందర్ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అంతులేని కథలో జయప్రద పాత్ర ఇష్టం. సినిమాలో అలా వచ్చి వెళ్లే క్యారెక్టర్లను నేను రాయను. కథ రాసుకున్నప్పుడు ఎవ్వరినీ ఊహించుకోలేదు. ఇద్దరు హీరోలు అని కథ రాసుకున్నా. కొంత మంది దగ్గరికి వెళ్లాను. కథ బాగా నచ్చిందని అందరూ అన్నారు. కానీ కొంత మంది సోలో హీరో అయితే చేస్తాను అని అన్నారు. కానీ నేను ఇదే కథ చేస్తాను అని పట్టుబట్టాను. అలా చివరకు శర్వా, సిద్దులు ఓకే అయ్యారు.

హీరోల కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొన్ని కొన్ని సీన్లలో మాటలు, వారే మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్నాను. ఫ్రెండ్ అంటే నాలుగు రోజులు కలిసి తిరిగి, బీర్లు తాగివెళ్లడం కాదు. ఒక్కసారి మనం ఫ్రెండ్ అని అనుకుంటే.. వాడు చేసే తప్పులను, ఒప్పులను అంగీకరించాలి. జీవితాంతం వాడి కోసం నిలబడాలని చెప్పే కథ.

ప్రేమకు హద్దుల్లేవు. నీ మీద నీకు ఎంత ప్రేమ అని అంటే.. అంత ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవలేం. ఒక్కోసారి ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకే కొలవలేనంత ప్రేమ అనే క్యాప్షన్‌ను పెట్టాం. నేను చూసిన కొంతమంది క్యారెక్టర్స్, వారి క్యారెక్టరైజేషన్స్ ఈ చిత్రంలో వాడాను. అలా మా అమ్మమ్మ గారు తన చేతిని కొరుక్కునేది. పిల్లల అల్లరిని తట్టుకోలేక అలా చేసివారు. అదే రావు రమేష్ గారికి పెట్టాం. జగపతి బాబు గారి పాత్రను మన చుట్టూ చూస్తుంటాం. ఆయనే ఈ సినిమా క్యారెక్టర్స్ అతి పెద్ద బలంగా మారుతాయి. సినిమా చూసి బయటకు వచ్చాక హీరో హీరోయిన్లు గుర్తుకు ఉండరు. క్యారెక్టర్సే గుర్తుంటాయి.

ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు శర్వా క్యారెక్టర్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసి బయటకు వచ్చాక శర్వా పాత్రను మీరంతా ప్రేమిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి నా మెంటాలిటీ తెలుసు. నాకు ఏ టైప్, కొత్త జానర్‌లు అంటే ఇష్టమని తెలుసు. రంభ రంభ, చెప్పకే చెప్పకే పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇక సినిమాలో విజువల్స్ చూస్తే అందరికీ నచ్చుతాయి. ఈ సినిమాకు ఆయనే మెయిన్ పిల్లర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ వింటారు. నా బాస్ (ఆర్జీవీ) దగ్గర నేర్చుకుందే సౌండ్ గురించి. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.

RX100 సినిమాకు పని చేసిన డైరెక్షన్ టీంలో ఇప్పటికి ముగ్గురు దర్శకులు అయ్యారు. ఇక మహా సముద్రం కోసం పని చేసిన పది మంది త్వరలోనే దర్శకులు కాబోతోన్నారు. వారు నాకంటే టాలెంట్. RX100 సినిమా పాన్ ఇండియా. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ అవుతోంది. అంటే RX100 ఐడియా పాన్ ఇండియా. ఇప్పుడు మహా సముద్రం కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి.

RX100 బాలీవుడ్ రీమేక్ కోసం ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో చేయాలనే ఆసక్తి నాకు లేదు. నాకు ఇక్కడ చాలా బాగుంది. అక్కడి కంటే ఇక్కడే బాగుంది. తెలియని వాళ్ల దగ్గరకి వెళ్లి సినిమా చేయాలని ఇప్పుడు అనిపించలేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఓటీటీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో ఆంథాలజీ కాన్సెప్ట్ కోసం అడిగారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓటీటీలో అయితే మన ఐడియాను ఇంకాస్త విస్తృతంగా చూపించవచ్చు. థియేటర్లో చూపించలేని ఐడియాను, ఆ స్పాన్‌ను ఓటీటీ కోసం ఇంకాస్త పెంచుకోవచ్చు. నాకు కూడా ఓటీటీ అంటే ఇష్టం.

అన్ని జానర్లలో చిత్రాలు చేయాలని ఉంది. మహా సముద్రం తరువాత మాస్ ఎంటర్టైనర్‌తో రాబోతోన్నాను. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తాను. దర్శకుడు కావాలన్నదే నా కల. మొదటి చిత్రంతోనే ఆ కల నెరవేరింది. ఆ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని కూడా ఆలోచించలేదు. నేను దర్శకుడని అయ్యాను అనే తప్పా.. సినిమా ఫలితం గురించి నేను ఆలోచించలేదు. నాకు పలాన సినిమా చేయాలి అనే కల ఏమీ లేదు. నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్తాను.

ఎడిటర్ ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. వంద సినిమాలకు పైగా చేశారు. ఇక్కడి వారే అయినా తమిళంలో పాపులర్ అయ్యారు. నా గురించి ఆయనకు తెలుసు. నా మైండ్‌లో ఏముంటుంది? నేను ఏమనుకుంటానో.. అదే కట్ ఉంటుంది. ఆయన కట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఫోటోగ్రఫీ అయితే విజువల్స్ ఇప్పటికే చూశారు. ఇంత వరకు వైజాగ్‌ను ఎవ్వరూ చూపించని విధంగా మేం చూపించాం.

మనం మాట్లాడుకునే విధంగానే ఇందులో డైలాగ్స్ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఫిలాసిఫికల్‌గా ఉంటాయి. డైలాగ్స్ సయ్యద్ రాశాడు. మన జీవితం మనకు నచ్చినట్టుగా ఉండాలంటే దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి.. అనేది ఫిలాసిఫికల్ డైలాగ్. మహజ్జాతకుడు, ఏం అనుకుంటే అది జరిగిపోతుంది అని దేవుడు సృష్టించాడేమో అనేది ఆ డైలాగ్ అర్థం. సినిమాలో డైలాగ్స్ అదిరిపోతాయి. సన్నివేశాలకు తగ్గట్టుగా కొన్ని డైలాగ్స్ వస్తాయి.. అవి మహాద్బుతంగా ఉంటాయి.అయితే ఇది ఓపెన్ డ్రామా అని ప్రేక్షకులకు అంతా తెలుస్తూనే ఉంటుంది కానీ కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు