కమెడియన్ సత్య మరియు దర్శకుడు రితేష్ రాణా మరోసారి జతకట్టి ‘జెట్లీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో వీరు ‘మత్తు వదలరా’ సిరీస్తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తమదైన శైలిలో వైవిధ్యమైన హాస్యం మరియు యాక్షన్ మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్య మార్కు కామెడీకి, రితేష్ రాణా మార్కు స్క్రీన్ ప్లే తోడైతే మరో క్రేజీ ఎంటర్టైనర్ గ్యారెంటీ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో సత్యతో పాటు వెన్నెల కిషోర్ కనిపించడం చూస్తుంటే, సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోంది.
క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ) మరియు హేమలత పెద్దమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మరి ‘జెట్ లీ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.


