విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ, ఇటీవల “తిమ్మరుసు” చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్ తాజాగా తన కొత్త చిత్రాన్ని మొదలెట్టేశాడు. కొత్త దర్శకుడు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో, అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కెరిర్ పరంగా సత్యదేవ్కి 25వ చిత్రం కావడం విశేషం. నేడు పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమయ్యింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు కొరటాల శివ, హరీశ్ శంకర్ హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం కొరటాల శివ తన చేతుల మీదుగా స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేయగా, హరీశ్ శంకర్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత దిల్ రాజు సత్యదేవ్పై క్లాప్నిచ్చారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.