స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ రాపిడో సంస్థ కోసం ఇటీవల ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులో మామూలు దోసెలా ఎక్కినోళ్లని కురుమా వేసి, కైమా కొట్టి, మసలా దోసె వేసి దింపుతారని, ఎందుకు వచ్చిన పేరంటం అండి రాపిడో బుక్ చేసుకోండి దోసె తీసినంత సులువుగా ట్రాఫిక్లో చమట పట్టకుండా వెళ్లిపోండి.. పొదుపు చేయండి అని ఉంటుంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, సంస్థ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందని అల్లు అర్జున్తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు పంపారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని, ఆర్టీసీ సంస్థను కించపరిస్తే ఎవరినైనా సహించేది లేదని, ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని సజ్జనార్ కోరారు.