గత కొద్దిరోజుల క్రితం తునిలో కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మహా గర్జన ఉద్రిక్తంగా మారి ఏకంగా ఓ రైలునే తగలబెట్టే దాకా వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ఓ ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘటన గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన రైలు తగలబెట్టడం అసాంఘీక శక్తుల చర్య అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని, అధికార పార్టీ కూడా ఈ డిమాండ్కు మద్ధతు తెలిపిన విషయాన్ని మీడియా సమావేశంలో పవన్ గుర్తుచేశారు. ఇక తాజాగా మళ్ళీ ఇదే విషయమై పవన్ ట్విట్టర్ను వేదికగా చేసుకొని కాపుల డిమాండ్ను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీని కోరారు. మేధావులు, కాపు సంఘం లీడర్స్తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి తగు న్యాయం చేసే ఆలోచన చేయాలని పవన్ కోరారు.
— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2016